గ్రామీణ మహిళలకు అండగా ఎస్హెచ్జీ ఫెడరేషన్ భవనాలు.
– ప్రతి గ్రామంలో రూ.10 లక్షలతో మహిళా భవనాలు.
– 200 గజాల్లో, 552 చదరపు అడుగుల్లో నిర్మాణం.
– ప్రభుత్వ స్థలాల గుర్తింపుతో పనులు చేపట్టాలన్న ఆదేశాలు.
– మంత్రి సీతక్క.
జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 24:
గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాలు, గ్రామ స్థాయి సంస్థలు, ఎస్హెచ్జీ ఫెడరేషన్లకు శాశ్వత వేదికగా నిలిచే భవనాల నిర్మాణానికి సవరించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. గ్రామ స్థాయిలో మహిళా సంఘాల బలోపేతానికి ఇది చారిత్రాత్మక ముందడుగు అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు.మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో మహిళా భవనాలను నిర్మించనున్నారు. సుమారు 200 గజాల విస్తీర్ణంలో, 552 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో ఈ భవనాలు రూపుదిద్దుకోనున్నాయి. మహిళా సంఘాలు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఇవి శాశ్వత కేంద్రాలుగా ఉపయోగపడనున్నాయి.
గ్రామ స్థాయిలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో, వాటిని గుర్తించి మహిళా భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంస్థలు, ఫెడరేషన్ల కోసం శాశ్వత భవనాలు కల్పించాలని మహిళా సభ్యులు చాలా కాలంగా చేస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సంఘటితంగా పనిచేసేందుకు మౌలిక సదుపాయాల కొరత ఒక ప్రధాన అడ్డంకిగా ఉండేదని అధికారులు తెలిపారు. ఈ మహిళా భవనాల నిర్మాణంతో ఆ సమస్య తొలగిపోతుందని, మహిళల ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, వారి స్వావలంబన దిశగా కీలకంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments