పంజాబ్కు షాక్.. ప్రీతీ జింటా ఆందోళన
జనం వాయిస్, ధర్మశాల, మే 15:
ఐపీఎల్లో భాగంగా గురువారం ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా ఓటమి పాలైంది. ముఖ్యంగా ముంబై బ్యాటర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతీ జింటా తీవ్ర నిరాశకు గురైనట్లు కనిపించారు. మైదానంలోనే జట్టు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్తో ఆమె చాలా సేపు చర్చలు జరిపారు. ఇద్దరూ ఆందోళనతో మాట్లాడుకుంటున్న దృశ్యాలు కెమెరాలో కనిపించడంతో అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ సీజన్ తొలి భాగంలో పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆడి ప్లే ఆఫ్స్కు బలమైన పోటీదారుగా కనిపించింది. అయితే వరుసగా ఐదో ఓటమిని చవిచూడడంతో జట్టు పరిస్థితి క్లిష్టంగా మారింది. ప్రస్తుతం పంజాబ్ జట్టు 12 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో కొనసాగుతోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా ప్లే ఆఫ్స్ రేసులో గట్టిగా పోటీ ఇస్తుండటంతో పంజాబ్ అవకాశాలు కష్టాల్లో పడ్డాయి. మ్యాచ్ సందర్భంగా రికీ పాంటింగ్ బౌండరీ లైన్ వద్దే నిలబడి ఆటగాళ్లను ఉత్సాహపరిచినా ఫలితం లేకపోయింది. భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు విఫలమయ్యారు. 200 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ పంజాబ్ దానిని నిలబెట్టుకోలేకపోయింది. మరోవైపు కీలక ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లేకపోయినా ముంబై ఇండియన్స్ సమష్టిగా రాణించింది. ముఖ్యంగా తిలక్ వర్మ తన దూకుడు ఆటతో మ్యాచ్ను పూర్తిగా ముంబై వైపు తిప్పేశాడు. కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్లో ఆరు భారీ సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసిపోయాయని భావించిన ముంబై ఇండియన్స్ ఈ విజయంతో మళ్లీ ఆశలు సజీవంగా ఉంచుకుంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ను మరింత ఒత్తిడిలోకి నెట్టింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments