లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ.
– ఉపాధి హామీ పనుల బిల్లుల ప్రక్రియ కోసం లంచం డిమాండ్
– ద్విచక్ర వాహనం సీటు కింద నుంచి నగదు స్వాధీనం
– చొప్పదండి పంచాయతీరాజ్ సహాయ ఇంజనీర్ అరెస్టు
జనం వాయిస్, కరీంనగర్, జులై 10:
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండల పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజనీర్ పైడి సతీష్ను రూ.10 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, గతంలో గంగాధర మండలంలో సహాయ ఇంజనీర్గా పనిచేసిన పైడి సతీష్ ప్రస్తుతం చొప్పదండి మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద ఫిర్యాదుదారుడు చేపట్టిన సీసీ రోడ్డు పనులకు సంబంధించిన కొలతలను ఎం-బుక్లో నమోదు చేసి, వాటిని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు పంపేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ కరీంనగర్ రేంజ్ అధికారులు ఉచ్చుపన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో పైడి సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తీసుకున్న లంచం నగదు అతని టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం (నంబర్: టీఎస్ 02 ఎఫ్ఎఫ్ 8800) సీటు కింద దాచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
విధులను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినందున నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. అనంతరం అతడిని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు సూచించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments