గోరింటాకు ఎర్రగా పండితే సౌభాగ్యం పండినట్లే.
“గోరింటాకు ఎర్రగా పండితే సౌభాగ్యం పండినట్లే” అనే నానుడి తెలుగు మహిళల జీవితంలో గోరింటాకు స్థానాన్ని తెలియజేస్తుంది. ఆషాఢ మాసం అనగానే అమ్మవారి ఆరాధనలు, బోనాల పండుగలు, పచ్చని ప్రకృతి, వర్షపు చినుకులు, మహిళల చేతులపై మెరిసే గోరింటాకు గుర్తుకొస్తాయి. ఇది కేవలం ఒక అలంకార సంప్రదాయం మాత్రమే కాదు; భారతీయ సంస్కృతిలో ఆరోగ్యం, ఆధ్యాత్మికత, కుటుంబ అనుబంధం, సౌభాగ్యం, ప్రకృతి ప్రేమ, మహిళల ఆనందానికి ప్రతీకగా నిలిచిన గొప్ప ఆచారం.తెలుగు రాష్ట్రాలలో ఆషాఢ మాసం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో అమ్మవారి పూజలు, బోనాల ఉత్సవాలు, వ్రతాలు, కుటుంబ వేడుకలు విస్తృతంగా జరుగుతాయి. ఈ సందర్భంగా మహిళలు కొత్త చీరలు ధరించి, గాజులు వేసుకొని, పూలతో అలంకరించుకొని, చేతులకు గోరింటాకు పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా వివాహమైన మహిళలు, యువతులు, చిన్నారులు గోరింటాకు పెట్టుకోవడం ఆనందోత్సాహాలకు ప్రతీకగా కొనసాగుతోంది.గోరింటాకు వెనుక ఆధ్యాత్మిక విశ్వాసం కూడా ఉంది. లక్ష్మీదేవికి గోరింటాకు ఎంతో ప్రీతికరమని, దీనిని ధరించిన మహిళలకు ఐశ్వర్యం, సౌభాగ్యం, కుటుంబ సుఖశాంతులు కలుగుతాయని పెద్దలు విశ్వసిస్తారు. వివాహిత మహిళలు భర్త దీర్ఘాయుష్షు కోసం, అవివాహిత యువతులు మంచి వరుడు లభించాలని కోరుకుంటూ గోరింటాకు పెట్టుకునే ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది. బోనాల సందర్భంగా అమ్మవారికి సమర్పించే భక్తిలో కూడా గోరింటాకు ఒక ముఖ్యమైన భాగంగా కనిపిస్తుంది.మన పూర్వీకులు ప్రతి సంప్రదాయంలో శాస్త్రీయతను దాచిపెట్టారు. గోరింటాకు కూడా అలాంటి ప్రకృతి వరమే. వర్షాకాలంలో శరీరంలో వేడి, తేమ కారణంగా కలిగే అసౌకర్యాలను తగ్గించడంలో గోరింటాకు సహాయపడుతుంది. ఇది శరీరానికి సహజ చల్లదనాన్ని అందిస్తుంది. చేతులు, కాళ్లలోని మంటను తగ్గిస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. సూక్ష్మక్రిముల పెరుగుదలను కొంతవరకు అడ్డుకుంటుంది. గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగించే గుణాలు కూడా ఇందులో ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందువల్ల గోరింటాకు కేవలం అందం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్య రక్షణలో భాగంగా కూడా మన పెద్దలు అలవాటు చేశారు.ఆషాఢ మాసంలో మహిళలు ఒకచోట చేరి గోరింటాకు పెట్టుకోవడం సామాజిక బంధాలను బలపరిచే సంప్రదాయం. గోరింటాకు రుబ్బడం, ఒకరికొకరు పెట్టడం, జానపద గీతాలు పాడడం, నవ్వులు పంచుకోవడం ద్వారా కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారితో అనుబంధం మరింత బలపడుతుంది. చిన్నారులకు సంప్రదాయాల విలువలను నేర్పే అవకాశం కూడా ఇదే.ప్రస్తుతం రసాయనాలతో తయారయ్యే మెహందీ కోన్లు ఎక్కువగా వాడుతున్నప్పటికీ, సహజ గోరింటాకు విలువను మరచిపోకూడదు. కొన్ని రసాయన మెహందీలు చర్మ అలర్జీలు, ఇతర సమస్యలకు కారణమవుతాయి. అందువల్ల ఇంట్లో పెంచిన గోరింటాకు ఆకులను ఉపయోగించడం ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ ఔషధ మొక్కను సంరక్షించడం కూడా మన బాధ్యత.నేటి వేగవంతమైన జీవనశైలిలో సంప్రదాయాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అయితే గోరింటాకు వంటి ఆచారాలు మన సంస్కృతి వైభవాన్ని గుర్తు చేస్తాయి. ఇవి మహిళల అందాన్ని పెంచడమే కాదు, ప్రకృతితో మమేకం కావాలని, కుటుంబ బంధాలను కాపాడుకోవాలని, ఆరోగ్యాన్ని సంరక్షించాలని సందేశం ఇస్తాయి. కొత్త తరానికి ఈ సంప్రదాయాల వెనుక ఉన్న సాంస్కృతిక, శాస్త్రీయ విలువలను తెలియజేయడం ప్రతి కుటుంబం బాధ్యత. ఆషాఢ మాసంలో మహిళలు పెట్టుకునే గోరింటాకు అనేది కేవలం చేతులకు వేసుకునే రంగు కాదు; అది ఆరోగ్యానికి ఆయుర్వేదం, కుటుంబానికి అనుబంధం, మహిళకు సౌభాగ్యం, సమాజానికి సంస్కృతి, ప్రకృతికి మనిషి కృతజ్ఞత. ఈ విలువైన సంప్రదాయాన్ని పరిరక్షించి, సహజ గోరింటాకును ప్రోత్సహించడం ద్వారా మన సంస్కృతి పరిమళం తరతరాలకు వ్యాపించేలా చేయాలి. గోరింటాకు చేతులకు మాత్రమే కాదు, మన తెలుగు సంస్కృతికి కూడా చిరస్థాయిగా నిలిచే ఎర్రటి సంతకం.
ఇట్లు.
ఆళవందార్ వేణు మాధవ్.
8686051752, హైదరాబాద్.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments