కరువు ముప్పు మళ్లీ ముంచుకొస్తుందా? మే నుంచే ‘సూపర్ ఎల్ నినో’ హెచ్చరికలు!
జనం వాయిస్, వెబ్ డెస్క్:
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో ‘ఎల్ నినో’ ప్రభావం మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మే రెండో వారం నుంచే దీని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉందని, జులై నాటికి ఇది మరింత బలపడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఆందోళన వ్యక్తం చేసింది. 1876-77 కాలంలో సంభవించిన మహా కరువు పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా వర్షపాతం తగ్గే అవకాశముండగా, పశ్చిమ కనుమల్లో వర్షాలు పడకపోతే కృష్ణా, గోదావరి నదుల్లో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. దీని ప్రభావం తెలంగాణ సాగునీటి రంగంపై తీవ్రంగా పడే అవకాశముంది. అమెరికాకు చెందిన NOAA, బ్రిటన్ వాతావరణ శాఖ, యూఎస్ క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి.
మొదట జూన్ రెండో వారం నాటికి ఎల్ నినో ప్రభావం బలపడుతుందని భావించినా, తాజా పరిస్థితులను పరిశీలిస్తే మే రెండో వారం లేదా జూన్ మొదటి వారానికే ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జులై నాటికి ఇది మరింత బలపడే అవకాశముందని WMOలోని క్లైమేట్ ప్రెడిక్షన్ చీఫ్ విల్ఫ్రాన్ మౌఫౌమా తెలిపారు.
సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1 డిగ్రీల వరకు పెరిగితే నార్మల్ ఎల్ నినోగా పరిగణిస్తారు. 1 నుంచి 2 డిగ్రీల మధ్య ఉంటే మోస్తరు ఎల్ నినో, 2 డిగ్రీలకు మించి పెరిగితే ‘సూపర్ ఎల్ నినో’గా గుర్తిస్తారు. ప్రస్తుతం మార్చి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని NOAA వెల్లడించింది. ఇప్పటికే 0.6 డిగ్రీల పెరుగుదల నమోదైందని తెలిపింది.
ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభావం కనిపిస్తోంది. మేఘాల ఏర్పాటుకు ఆటంకం కలిగించే ఔట్గోయింగ్ లాంగ్వేవ్ రేడియేషన్ (OLR) పెరగడంతో వర్షాలు తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి క్రమంగా మరింత బలపడుతోంది.
కరువు కాటకాల ముప్పు
సూపర్ ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటే కరువు పరిస్థితులు మరింత విషమించవచ్చు. 1876-77లో సంభవించిన మహా కరువులో ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అది ప్రపంచ జనాభాలో దాదాపు 4 శాతం. భారతదేశంలోనే సుమారు 96 లక్షల మంది మృతి చెందారు.
ఆ సమయంలో బాంబే, మైసూరు, మద్రాస్, హైదరాబాద్ ప్రాంతాల్లో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో పంటలు విఫలమయ్యాయి. ఈ కరువును ‘మద్రాస్ ఫెమైన్’గా పిలిచేవారు. లక్షలాది మంది రైతులు, కార్మికులు జీవనోపాధి కోసం వలసలు వెళ్లాల్సి వచ్చింది.
తెలంగాణపై ప్రభావం ఎంత?
తెలంగాణలో కూడా ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశముంది. సాధారణంగా 92% వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి 5% వరకు లోటు ఉండవచ్చని అంచనా. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాభావం ఉంటే పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గి కృష్ణా, గోదావరి నదులకు వరదలు తగ్గే అవకాశం ఉంది.
దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండక సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన వర్షపాతం లోటు, తూర్పు జిల్లాల్లో మధ్యస్థ లోటు ఉండవచ్చని అంచనా. దక్షిణ జిల్లాలపై ప్రభావం తక్కువగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంపై ముఖ్య ప్రభావాలు
వర్షపాతం 87% నుంచి 92% మధ్యే ఉండే అవకాశం
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గితే నదుల ప్రవాహం తగ్గే ప్రమాదం
సాగునీటి ప్రాజెక్టులు నిండక ఇబ్బందులు
ఉత్తర తెలంగాణలో తీవ్ర వర్షాభావం
మే రెండో వారం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాతావరణ శాఖ అధికారులు క్లోజ్ మానిటరింగ్ కొనసాగిస్తున్నారు. ఎల్ నినో ముందుగానే ప్రభావం చూపితే రాష్ట్రంపై దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments