తెలంగాణ పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు.
తెలంగాణ పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు.
సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం.
మొత్తం 7,437 పోస్టుల భర్తీకి జూలై 29న నోటిఫికేషన్.
ఇప్పటివరకు 2.88 లక్షల మంది దరఖాస్తు ప్రక్రియ పూర్తి.
చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు రావొచ్చని బోర్డు సూచన.
జనం వాయిస్, డెస్క్, సెప్టెంబర్ 09:
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాష్ట్ర పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) కీలక ప్రకటన చేసింది. కానిస్టేబుల్ స్థాయి పోస్టుల దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9వ తేదీతో ఈ గడువు ముగియాల్సి ఉండగా, అభ్యర్థుల సౌకర్యార్థం సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,437 పోస్టుల భర్తీ కోసం టీఎస్ఎల్పీఆర్బీ జూలై 29న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో సివిల్ కానిస్టేబుల్ (3,697), ఏఆర్ కానిస్టేబుల్ (1,052), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ (1,380), ఫైర్ ఫైటర్ (751), జైల్ వార్డర్ (208), ఎస్ఏఆర్ సీపీఎల్ (24) పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగల కోసం ఇప్పటివరకు 3,38,336 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 2,88,530 మంది ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేశారు. ఆధార్ వెరిఫికేషన్ సైతం 95 శాతానికి పైగా పూర్తయినట్లు బోర్డు తెలిపింది. గడువు ముగిసే ఆఖరి రోజుల్లో దరఖాస్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని బోర్డు పేర్కొంది. కాబట్టి అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments