వలిగొండ–కాటేపల్లి నూతన రహదారి ప్రారంభం.
– గ్రామీణ రవాణాకు కొత్త ఊపిరి.
– సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.
జనం వాయిస్, యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 28:
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో వలిగొండ నుంచి కాటేపల్లి వరకు రూ.49.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రహదారిని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ రహదారి ప్రారంభంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే బలమైన మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఆ దిశగా నాణ్యమైన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వలిగొండ–కాటేపల్లి రహదారి ద్వారా గ్రామాల మధ్య ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, విద్య, వైద్యం, వ్యాపారం వంటి రంగాలకు మరింత సౌలభ్యం చేకూరుతుందని స్పష్టం చేశారు.నాణ్యమైన రహదారులు – సమగ్ర అభివృద్ధి అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం పురోగమిస్తుందన్న నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రహదారి ప్రారంభంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమైందని, ప్రభుత్వ అభివృద్ధి చర్యలకు ఇది మరో నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments