తప్పుడు జీఎస్డీపీ గణాంకాలతో ప్రజలను మోసం చేస్తున్నారు: జగన్.
ఆర్థిక వృద్ధిపై ప్రభుత్వ వాదనలకు కాగ్ లెక్కలే సాక్ష్యం.
పన్నుల రాబడిలో ఏపీ 22వ స్థానం – ‘22వ ర్యాంక్ విజన్’ అంటూ ఎద్దేవా.
జనం వాయిస్, అమరావతి:
వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం తప్పుడు జీఎస్డీపీ (స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి) గణాంకాలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందనే భ్రమ కల్పించేందుకే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75 శాతం వృద్ధి సాధించిందని, 2025–26లో ఇది 10.75 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పడాన్ని జగన్ తప్పుబట్టారు. ఈ వృద్ధి రేటుతో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇవి ఏ స్వతంత్ర సంస్థ ఇచ్చిన లెక్కలు కావని, కేవలం నారా చంద్రబాబు నాయుడు కార్యాలయంలో సృష్టించిన గణాంకాలేనని విమర్శించారు. ప్రభుత్వం చెబుతున్న వృద్ధి నిజమైతే పన్నుల రాబడిలోనూ అదే స్థాయి పెరుగుదల కనిపించాల్సి ఉంటుందని జగన్ అన్నారు. కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలలకు విడుదల చేసిన లెక్కలు ప్రభుత్వ బూటకపు ప్రచారాన్ని బట్టబయలు చేశాయని తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్ర పన్నుల రాబడి వృద్ధి సగటున కేవలం 1.97 శాతంగా మాత్రమే ఉందని, ఇది దిగ్భ్రాంతికరమన్నారు. “11 శాతం పైగా జీఎస్డీపీ వృద్ధి సాధిస్తున్న రాష్ట్రంలో పన్నుల రాబడి 2 శాతం లోపు ఎలా ఉంటుంది?” అని ప్రశ్నిస్తూ ఎద్దేవా చేశారు.
ఇదే సమయంలో దేశంలోని 23 రాష్ట్రాల పన్నుల రాబడి వృద్ధిపై కాగ్ విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావించిన జగన్, ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు నుంచి రెండో స్థానంలో—అంటే 22వ ర్యాంక్లో నిలవడం సిగ్గుచేటన్నారు. ఇదే చంద్రబాబు ‘22వ ర్యాంక్ విజన్’ అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ మొదటి స్థానంలో ఉందంటే అది అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపులు, తప్పుడు ప్రచారంలో మాత్రమేనని జగన్ తీవ్రంగా విమర్శించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments