క్రికెటర్లకు కాంట్రాక్ట్ శుభవార్త
జనం వాయిస్, ముంబై, ఏప్రిల్ 16:
ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు ముంబై క్రికెట్ సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తొలిసారిగా కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న అన్క్యాప్డ్ ఆటగాళ్లకు ఈ కాంట్రాక్ట్లు వర్తిస్తాయి. ప్రదర్శన, ఫిట్నెస్, సెలెక్షన్ కమిటీ సిఫారసుల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసి వార్షికంగా పారితోషికం చెల్లించనున్నట్లు సంఘం వెల్లడించింది. పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకు కూడా ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఆటగాళ్లను మూడు గ్రేడ్లుగా విభజించనున్నారు. గ్రేడ్ ఏలో ఉన్న వారికి ఏడాదికి సుమారు 12 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు లభిస్తాయి. గ్రేడ్ బీ ఆటగాళ్లకు 8 లక్షల నుంచి 12 లక్షల వరకు, గ్రేడ్ సీ వారికి సుమారు 8 లక్షల రూపాయల వరకు చెల్లించనున్నారు. వీటికి అదనంగా మ్యాచ్ ఫీజులు, అలవెన్సులు, ప్రదర్శన ఆధారిత ప్రోత్సాహకాలు కూడా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ కాంట్రాక్ట్ విధానం ముంబై క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని సంఘం అధ్యక్షుడు అజింక్య నాయక్ పేర్కొన్నారు. ఆటగాళ్లకు ఆర్థిక భరోసా కల్పించడం, ప్రతిభను ప్రోత్సహించడం, ఫిట్నెస్ ప్రమాణాలను పెంపొందించడం, పోటీ స్థాయిని మరింత పెంచడం ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యాలుగా తెలిపారు. 2026-27 సీజన్ నుంచే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అమల్లోకి రానుందని సంఘం వెల్లడించింది. దీంతో యువ క్రికెటర్లు ఆటపై మరింత దృష్టి పెట్టి, స్థిరమైన ప్రదర్శన ఇవ్వడానికి ఇది ఉపయోగపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments