మహిళపై దాడి చేసిన సర్పంచ్ మేడ రాజయ్య పై చర్యలు తీసుకోవాలి.
– మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భాధితురాలు మేడ విజయ.
జనం వాయిస్, మంథని, మే 19 :
మంథని మండలం గోపాలపూర్ సర్పంచ్ మేడ రాజయ్య తనపై దాడికి పాల్పడ్డాడని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు మేడ విజయ మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన అత్తమామలు సంపాదించిన వ్యవసాయ భూమికి సంబంధించి కొంతకాలంగా వివాదం కొనసాగుతోందని, ఈ విషయమై మంథని కోర్టులో కేసు కూడా నడుస్తోందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని గోపాలపూర్ గ్రామ సర్పంచ్ మేడ రాజయ్య తనపై కక్ష పెంచుకున్నాడని ఆరోపించింది. తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మేడ రాజయ్య తన ఇంటి వద్దకు వచ్చి దుర్భాషలాడుతూ ఇంట్లోకి ప్రవేశించాడని తెలిపింది. అనంతరం తన వెంట తెచ్చుకున్న కర్రతో దాడి చేసి ఎడమ భుజం, ఎడమ చేతి భాగం, పక్కటెముకల వద్ద గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా గొంతు పట్టుకుని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. అడ్డు వచ్చిన వారిపైనా మేడ రాజయ్య, అతని భార్య ఓదమ్మ, కుమారుడు సత్యనారాయణ దుర్భాషలాడుతూ దాడికి దిగేందుకు ప్రయత్నించినట్లు బాధితురాలు తెలిపింది. తనపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితురాలు మంథని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments