బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నందుకు ఆ ఇండ్లకు కరెంట్ కట్.
జనం వాయిస్, జనగామ, జూన్ 29:
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని నష్కల్ గ్రామం మద్యపాన రహిత గ్రామంగా మారాలని ఇటీవల తీర్మానం చేసుకుంది. అదే లక్ష్యంతో ఒక నిర్ణయాన్ని అమలు చేసింది. గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్న ఆరుగురి ఇళ్లకు అధికారులు విద్యుత్ కనెక్షన్లను పూర్తిగా తొలగించారు. మద్యం రహిత గ్రామం కోసం గతంలో గ్రామసభలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ శాతబోయిన రాజు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.గ్రామ పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం… చిల్పూర్ మండలంలోని నష్కల్ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడవడం వల్ల స్థానిక యువత మద్యానికి ఆకర్షితులవుతున్నారు. దీనివల్ల వారు చెడు అలవాట్లకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకునే ప్రమాదం ఉందని చాలా మంది గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును, కుటుంబాల బాగును దృష్టిలో ఉంచుకుని, గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నియంత్రించాలని గతంలోనే గ్రామసభలో ప్రత్యేక తీర్మానం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తే వారి రేషన్ కార్డు, కరెంటుతో పాటు ఇతర ప్రభుత్వ సౌకర్యాలను కూడా నిలిపివేస్తామని సర్పంచ్ శాతబోయిన రాజు హెచ్చరించారు.గొప్ప చరిత్ర, ఆధ్యాత్మిక విలువలు ఉన్న నష్కల్ గ్రామాన్ని ఆదర్శవంతమైన మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో సర్పంచ్ శాతబోయిన రాజు నేతృత్వంలో గ్రామ పెద్దలు ఈ కఠినమైన నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ప్రజలందరితో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తీర్మానించారు. కాగా, ప్రస్తుత కరెంటు కనెక్షన్ కోల్పోయిన వ్యక్తులు, ఇకపై గ్రామంలో ఎలాంటి మద్యం అమ్మేది లేదని అధికారికంగా బాండు పేపర్ రాసి ఇస్తేనే.. వారి ఇళ్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని పంచాయతీ వర్గాలు స్పష్టం చేశాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments