సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో ప్రేక్షకుల ముందుకు మీనాక్షి చౌదరి.
జనం వాయిస్, సినిమా:
టాలీవుడ్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14న గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, ప్రమోషన్లలో భాగంగా మీనాక్షి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ ఎంపికలు, తనపై వస్తున్న రూమర్స్పై పూర్తి స్థాయిలో స్పందించారు.
ఇటీవల లక్కీ భాస్కర్ సినిమా తర్వాత తల్లి పాత్రలు చేయనని మీనాక్షి అన్నారంటూ ప్రచారం జరగడాన్ని ఆమె ఖండించారు. తాను ఎక్కడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను వక్రీకరించి రూమర్స్ సృష్టించడం బాధ కలిగిస్తోందని తెలిపారు. తాను ఎప్పుడూ కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తానని, కథ బలంగా ఉంటే హీరోయిన్ అయినా, సహాయక పాత్ర అయినా, క్యారెక్టర్ రోల్ అయినా చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. పాత్ర పేరు లేదా స్క్రీన్ టైమ్ కంటే కథలో ఆ పాత్ర ప్రాధాన్యమే తనకు ముఖ్యమని చెప్పారు. అలాగే తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వేదికల్లో వస్తున్న వార్తలపై కూడా మీనాక్షి క్లారిటీ ఇచ్చారు. తాను ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనని, తన పేరుతో వస్తున్న ప్రేమ, డేటింగ్, పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి రూమర్స్ విని అలసిపోయానని, వ్యక్తిగత జీవితంపై అనవసర ప్రచారాన్ని నమ్మొద్దని ఆమె కోరారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని, మంచి కథలు, మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావడమే తన లక్ష్యమని మీనాక్షి వెల్లడించారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న అనగనగా ఒక రాజు తన కెరీర్లో మరో మంచి మైలురాయిగా నిలుస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments