ఐపీఎల్ బ్రాండ్ విలువలో ఆర్సీబీ అగ్రస్థానం.
– రూ.1.97 లక్షల కోట్లకు చేరిన లీగ్ విలువ.
జనం వాయిస్, ముంబై, జూలై 29:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా లీగ్లలో ఒకటిగా మరోసారి తన సత్తా చాటుకుంది. హౌలిహాన్ లోకే విడుదల చేసిన 2026 ఐపీఎల్ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ ప్రకారం లీగ్ మొత్తం వ్యాపార విలువ రూ.1,97,024.68 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 11.4 శాతం వృద్ధి నమోదు చేసింది. అదే సమయంలో ఐపీఎల్ బ్రాండ్ విలువ కూడా రూ.41,106 కోట్లకు చేరి 10.3 శాతం పెరిగింది. బ్రాండ్ విలువ పరంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అగ్రస్థానంలో నిలిచింది. సుమారు రూ.2,987 కోట్ల బ్రాండ్ విలువతో రూ.3 వేల కోట్ల మార్కుకు చేరువైన తొలి క్రికెట్ ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది. ముంబై ఇండియన్స్ రూ.2,528 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, కోల్కతా నైట్రైడర్స్ రూ.2,346 కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ రూ.2,336 కోట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. మిగిలిన జట్లలో సన్రైజర్స్ హైదరాబాద్ రూ.1,608 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ రూ.1,541 కోట్లతో ఆరో స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ రూ.1,513 కోట్లతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ రూ.1,503 కోట్లతో ఎనిమిదో స్థానం దక్కించుకోగా, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1,494 కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ రూ.1,168 కోట్లతో పదో స్థానంలో కొనసాగింది. 2026లో ఫ్రాంచైజీల యాజమాన్యంలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బ్లాక్స్టోన్, బోల్ట్ వెంచర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్తో కూడిన కన్సార్టియం ఆర్సీబీని సుమారు రూ.17,042 కోట్ల విలువకు కొనుగోలు చేసింది. మరోవైపు మిట్టల్ కుటుంబం, అదర్ పూనావాలా కలిసి రాజస్థాన్ రాయల్స్ను సుమారు రూ.15,797 కోట్ల విలువతో సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వ్యాప్తి, ప్రసార హక్కుల విలువ పెరగడం, అంతర్జాతీయ పెట్టుబడిదారుల ఆసక్తి, ఫ్రాంచైజీల వాణిజ్య విస్తరణ వంటి అంశాలు ఐపీఎల్ బ్రాండ్ విలువను మరింత బలోపేతం చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. దీంతో ప్రపంచ క్రీడా వ్యాపార రంగంలో ఐపీఎల్ మరింత ప్రభావవంతమైన లీగ్గా ఎదుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments