ఉస్మానియా మెడికల్ కాలేజీలో 1257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు.
– నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం.
– వైద్య వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి.
– ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు.
జనం వాయిస్, హైదరాబాద్:
ఉస్మానియా మెడికల్ కాలేజీలో నూతనంగా ఎంపికైన 1257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సహచర మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని అభ్యర్థులను అభినందించారు. రాష్ట్ర వైద్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది కీలక ముందడుగుగా మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్ సేవలు వేగంగా, నాణ్యంగా అందించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున ఈ నియామకాలు చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వైద్య నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర అత్యంత కీలకమని, వారి సేవల వల్ల పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు. బాధ్యతాయుతంగా పని చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
ఈ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించినట్లు మంత్రి స్పష్టం చేశారు. అర్హత, ప్రతిభ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వ వైద్య సేవల ప్రమాణాలను మరింత పెంచాలని కోరారు. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు మానవ వనరుల బలోపేతానికి ప్రభుత్వం సమాంతరంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు.




Recent Comments