EPAPER
Sunday, May 3, 2026
Google search engine

కరీంనగర్‌లో పట్టపగలే కాల్పులు..!!

📰 Generate e-Paper Clip

కరీంనగర్‌లో పట్టపగలే కాల్పులు..!!


– అరగంట ముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన.
– కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటి సమీపంలో దొంగల వీరంగం.
–  నగరం ఒక్కసారిగా ఉలిక్కిపాటు.
– కరీంనగర్ గుండెల్లో గన్ శబ్దాలు.. దుండగుల దౌర్జన్యం.. పోలీసులు హైఅలర్ట్.

జనం వాయిస్, కరీంనగర్:

కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన సంచలన ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి అత్యంత సమీపంలో ఉన్న పీఎంజే జువెల్లర్స్‌లో ఏడుగురు దుండగులు పట్టపగలే దోపిడీకి పాల్పడి కాల్పులు జరపడం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. జిల్లా జడ్జి క్వార్టర్స్ వెనుక వైపున జరిగిన ఈ దారుణ ఘటనలో దుండగులు ముందుగా షాపులోకి చొరబడి సిబ్బంది, అక్కడ ఉన్న వారిని బెదిరించి బంగారం ఎత్తుకుపోయినట్లు తెలుస్తోంది. అనంతరం అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.
ఈ ఘటనలో అత్యంత సంచలన విషయం ఏమిటంటే.. దోపిడీ జరిగిన ప్రాంతానికి కేవలం అరగంట ముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి వెళ్లినట్లు సమాచారం. అంటే ఘటన స్థల పరిసరాల్లో అప్పుడు భద్రతా బందోబస్తు కూడా ఉన్నట్టే. అయినప్పటికీ దుండగులు ఇంత పెద్ద సాహసానికి దిగడం పోలీసు వ్యవస్థకు సవాల్‌గా మారింది.
ఇంకా ముందురోజే రాత్రి పోలీసులు నగరంలో నాకాబందీ నిర్వహించినట్లు తెలుస్తోంది. చెక్‌పోస్టులు, గస్తీ చర్యలు ఉన్నప్పటికీ మరుసటి రోజే నగర మధ్యలో ఈ తరహా కాల్పులు, దోపిడీ జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. నేరస్తులు ముందుగానే రేకీ నిర్వహించి పక్కా ప్రణాళికతో వచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటన అనంతరం దుండగులు వేగంగా అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. కోర్టు వెనుక లైన్ ప్రాంతంలో ఒక మ్యాగజైన్ లభ్యమైనట్లు తెలిసింది. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపే అవకాశం ఉంది.
సమాచారం అందుకున్న వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు, ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నగరమంతా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, బయటకు వెళ్లే మార్గాలన్నింటిని మూసివేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించి నిందితుల కదలికలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఈ ఘటనతో కరీంనగర్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేంద్ర మంత్రి ఇంటి సమీపంలోనే దుండగులు కాల్పులు జరిపి దోపిడీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. భద్రతా వైఫల్యంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!