ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళల కొట్లాట.. వైరల్ అయిన వీడియో.
పరిగి-హైదరాబాద్ బస్సులో సీట్ల కోసం మహిళల తీవ్ర ఘర్షణ.
సోషల్ మీడియాలో వైరల్ అయిన కొట్లాట వీడియో.
ఈ ఘటనపై ఇంకా స్పందించని టీజీఎస్ఆర్టీసీ, పోలీసులు.
జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 13:
మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళుతున్న టీజీఎస్ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కొందరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని, పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఉచిత ప్రయాణ పథకం వల్ల బస్సుల్లో పెరిగిన రద్దీ, తలెత్తుతున్న వివాదాలపై మళ్లీ చర్చ మొదలైంది.
వివరాల్లోకి వెళితే, వికారాబాద్ జిల్లా పరిగి నుంచి హైదరాబాద్కు వెళుతున్న బస్సులో ఈ గొడవ జరిగింది. వినాయక చవితి పండుగ నేపథ్యంలో బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో సీటు విషయంలో నలుగురు మహిళల మధ్య వాగ్వాదం మొదలై, అది తీవ్ర ఘర్షణకు దారితీసింది. తోటి ప్రయాణికులు వారిని విడదీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ గొడవతో ఇబ్బందిపడిన కొందరు ప్రయాణికులు బస్సు దిగి వెళ్లిపోయినట్లు సమాచారం.
తెలంగాణలో ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో తరచూ ఇలాంటి గొడవలు జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఒక మంచి పథకాన్ని ఇలాంటి ఘటనలతో అపహాస్యం చేస్తున్నారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments