సమయానికి అందని పెన్షన్లు..రిటైర్డ్ ఉద్యోగుల తీవ్ర అవస్థలు!
1వ తేదీన జీతాలిచ్చినట్లే మాకూ పెన్షన్లు ఇవ్వాలి: పెన్షనర్ల జేఏసీ డిమాండ్.
జనం వాయిస్, మంచిర్యాల, జూన్ 16:
సమయానికి పెన్షన్ అందక ప్రభుత్వ పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎప్పుడు పెన్షన్ చేతికొస్తుందోనని రిటైర్డ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. 20 నుంచి 30 ఏళ్ల పాటు ప్రభుత్వంలో సేవలందించిన తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం, రోజువారీ ఖర్చులకు డబ్బుల్లేక, అవసరాలు తీర్చుకుందామన్న అప్పుపుట్టని పరిస్థితి నెలకొంది. వచ్చే పెన్షనే తక్కువ కావడంతో, అది కూడా సమయానికి చేతికందకపోవడం వల్ల కేవలం పెన్షన్పైనే ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా డీటీఓ/ఎస్టీవోల ద్వారా సుమారు రెండున్నర లక్షలకు పైగా పెన్షనర్లు 1 లేదా 2వ తేదీన పెన్షన్లు పొందుతుండగా.. వివిధ శాఖల్లోని దాదాపు 5 వేల మందికి పైగా పెన్షనర్లకు మాత్రం 7 లేదా 8వ తేదీ వరకు, కొన్నిసార్లు నెల చివరలో చెల్లింపులు జరుగుతున్నాయి. క్లాస్ ఫోర్త్ ఉద్యోగులకు రూ.22 వేల నుంచి రిటైర్డ్ తహసీల్దార్కు రూ.83 వేల వరకు.. మొత్తంగా రూ.22 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు పెన్షన్ అందుకునే వారు ఇందులో ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, ఇంటర్మీడియట్ బోర్డు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, ఎయిడెడ్ కాలేజీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలతో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని రిటైర్డ్ నాన్-టీచింగ్ స్టాఫ్కు పెన్షన్ సకాలంలో అందడంలేదు.
ఈ నెల 9వ తేదీన అన్ని ప్రభుత్వ విభాగాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీల కింద పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాల్లో అన్ని రకాల ఉద్యోగులను ప్రస్తావించి, పెన్షనర్లను విస్మరించడం బాధాకరమని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి (పెన్షనర్ల జేఏసీ) పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏవిధంగానైతే 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నారో, అదే తరహాలో తమకు కూడా 1వ తేదీనే పెన్షన్ చెల్లించేలా అన్ని శాఖలకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments