ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు..అస్సాం ఎన్నికల ప్యానెల్కు నేతృత్వం.
జనం వాయిస్, న్యూఢిల్లీ :
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాం రాష్ట్ర అభ్యర్థుల ఎంపిక ప్యానెల్కు చైర్పర్సన్గా ఆమెను నియమించింది. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్యానెల్లను ఏర్పాటు చేసింది. ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలోని అస్సాం ప్యానెల్లో సప్తగిరి శంకర్ ఉలక, ఇమ్రాన్ మసూద్, సిరివెల్ల ప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. అస్సాంతో పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కూడా పార్టీ ప్యానెల్లను నియమించింది. కేరళ ప్యానెల్కు మధుసూదన్ మిస్త్రీ అధ్యక్షత వహిస్తుండగా, సయ్యద్ నసీర్ హుస్సేన్, నీరజ్ డాంగి, అభిషేక్ దత్ సభ్యులుగా ఉన్నారు.
తమిళనాడు, పుదుచ్చేరి ప్యానెల్కు టీఎస్ సింగ్ డియో నేతృత్వం వహిస్తారు. యశోమతి ఠాకూర్, జీసీ చంద్రశేఖర్, అనిల్ కుమార్ యాదవ్ సభ్యులుగా నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ప్యానెల్కు బీకే హరిప్రసాద్ చైర్పర్సన్గా వ్యవహరిస్తుండగా, మహ్మద్ జావేద్, మమతా దేవి, బీపీ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానెల్లు అభ్యర్థుల ఎంపిక, అంతర్గత సంప్రదింపులు, ఎన్నికల వ్యూహాల రూపకల్పన వంటి కీలక బాధ్యతలను నిర్వహించనున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments