దేశంలో నకిలీ లాయర్ల కలకలం.
- 40 శాతం వరకు నకిలీ న్యాయవాదులే.
- బార్ కౌన్సిల్ సంచలన వ్యాఖ్యలు.
- జనం వాయిస్, న్యూఢిల్లీ, మే 23:
దేశవ్యాప్తంగా కోర్టుల్లో నల్ల కోట్లు వేసుకుని ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల్లో భారీ సంఖ్యలో నకిలీ లాయర్లు ఉన్నారంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో దాదాపు 35 నుంచి 40 శాతం వరకు న్యాయవాదులు నకిలీ సర్టిఫికెట్లతో కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారని బీసీఐ ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా వెల్లడించారు. నకిలీ డిగ్రీలను కొనుగోలు చేయడం లేదా తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించడం ద్వారా పలువురు కోర్టుల్లో న్యాయవాదులుగా కొనసాగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారం బార్ కౌన్సిల్ దృష్టికి వచ్చిందని, ఇప్పటికే దీనిపై ప్రత్యేక చర్యలు ప్రారంభించామని తెలిపారు. నకిలీ డిగ్రీల వ్యవహారాన్ని అరికట్టేందుకు బీసీఐ దేశవ్యాప్తంగా న్యాయవాదుల విద్యార్హతల పరిశీలన చేపట్టింది. అడ్వకేట్ల డిగ్రీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఫారాలు సమర్పించాలని కోరగా, దాదాపు 40 శాతం మంది ఇప్పటివరకు వెరిఫికేషన్ ఫారాలు నింపలేదని వెల్లడించారు. ఫారాలు సమర్పించని వారిపై బీసీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటికే భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినట్లు మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతకు భంగం కలిగించే ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన “కాక్రోచ్ జనతా పార్టీ” వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. గత వారం ఒక పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కొందరు నకిలీ డిగ్రీలతో కోర్టుల్లోకి వస్తున్నారని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. అలాంటి వారినే ఉద్దేశిస్తూ “కాక్రోచ్” అనే పదాన్ని ఉపయోగించారని స్పష్టం చేశారు. నకిలీ డిగ్రీల వ్యవహారంపై అవసరమైతే సీబీఐ దర్యాప్తు కూడా కోరే అవకాశముందని బీసీఐ వర్గాలు సూచిస్తున్నాయి. న్యాయవృత్తి పవిత్రతను కాపాడేందుకు కఠిన చర్యలు తప్పవని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments