జోరుగా అక్రమ ఇసుక దందా..!
- “దమ్ముంటే పట్టుకోరా షికావత్తు..!?” అక్రమార్కుల సవాళ్లు.
- పట్టుకుంటే వదిలేస్తే సిండికేటు.., లేకుంటే బదిలీల వేటు!
- నెలకు రూ.10 లక్షలు ఇస్తే చాలు.. ఎంతైనా తోలుకోండి!
- ఇందిరమ్మ ఇళ్ల కూపన్ల పేరిట ప్రైవేటు వ్యక్తులకు తరలింపు; లబ్ధిదారుల జేబులకు చిల్లు.
- ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ హామీలు నీటిమూటలేనా? ప్రజల ప్రశ్న.
- మహబూబాబాద్, జూన్ 1 (జనం వాయిస్) :
- డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. బాధ్యత గల అధికారుల అండదండలతోనే అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నర్సింహులపేట, చిన్నగూడూరు మండలాల పరిధిలోని కొమ్ములవంచ, జైపురం, రామన్నగూడెం, కౌసల్యాదేవిపల్లి, ఫకీర తండా, ముంగిమడుగు, నెల్లికుదురు మండలాల సరిహద్దుల్లోని శివారు ర్యాంపుల నుండి ఇసుకను పంపింగ్ చేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు.దమ్ముంటే పట్టుకోరా షికావత్తు..!?సినిమా డైలాగులను తలపించేలా స్థానికంగా ఇసుక మాఫియా శృతిమించిపోతోంది. గతంలో అక్రమాలను ప్రశ్నించిన వారిని ఉద్దేశించి “దమ్ముంటే పట్టుకోరా షికావత్తు..!?” అంటూ విసిరిన సవాళ్లు ఇప్పుడు నియోజకవర్గంలో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. ఇసుక వాహనాలను పట్టుకుంటే, వెనకనుండి ఒత్తిళ్లు తెచ్చి రాత్రికి రాత్రే వదిలేలా చేయడం.. అలా వదిలేస్తే అది ‘సిండికేటు’గా మారడం ఇక్కడ సర్వసాధారణమైపోయింది. ఒకవేళ అధికారులు వినకుండా కఠినంగా వ్యవహరిస్తే రాజకీయ పలుకుబడితో బదిలీ చేయిస్తున్నారు.
- పోలీస్, రెవిన్యూ అధికారులతో సిండికేట్ :
- ఈ అక్రమ దందా వెనుక పెద్ద నెట్వర్క్ నడుస్తోంది. ట్రాక్టర్ల యాజమాన్యాలు స్థానిక రెవిన్యూ, పోలీస్ అధికారులతో సిండికేట్గా మారినట్లు తెలుస్తోంది. “నెలకు సుమారు రూ. 10 లక్షలు మాకు ముట్టజెప్పండి.. ఎంత ఇసుకైనా తోలుకోండి” అంటూ పోలీసులతో ఒప్పందం కుదిరినట్లు స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. అలాగే నరసింహులపేట పరిధి నుండి ఇసుక తరలించాలంటే స్థానిక రెవిన్యూ అధికారులకు రోజుకు సుమారు రూ. 50 వేలు ఇచ్చుకోవాలనే ఒప్పందం కూడా కుదిరినట్లు సమాచారం. మహబూబాబాద్, నెల్లికుదురు, చిన్నగూడూరు, కురవి, సీరోలు, డోర్నకల్ మండలాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులు పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు.ఇందిరమ్మ ఇళ్ల పేరిట నిలువుదోపిడీ:
- ఇందిరమ్మ ఇళ్ల పేరిట నిలువుదోపిడీ:
- ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ అక్రమార్కులు తమకు కాసుల కురిపించే సాధనంగా మార్చుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట కూపన్లు తీసుకొని, వాటిని అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. లబ్ధిదారుల నుండి అధికారికంగా ఒక ట్రిప్పుకు రూ. 3500 మాత్రమే తీసుకోవాల్సి ఉండగా, ఈ ఇసుక మాఫియా భేషరతుగా రూ. 6,500 వసూలు చేస్తూ అమాయక పేదలను నిలువునా ముంచుతోంది.
- నీటిమూటలుగా మారిన ఎమ్మెల్యే హామీలు :
- గత ఎన్నికల ప్రచారంలో డోర్నకల్ నియోజకవర్గంలో ఇసుక దందా, అవినీతి, అక్రమాలకు పూర్తిగా చెక్ పెడుతానని కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రు నాయక్ ప్రజలకు పెద్దఎత్తున హామీ ఇచ్చారు. అయితే ఆయన గెలిచిన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోగా, అక్రమాలు మరింత పెరిగాయని, ఆయన ఇచ్చిన హామీలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయాయని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.
- నిజాయితీ గల అధికారిపై బదిలీ వేటు.. అక్రమార్కుల సంబురాలు :
- చిన్నగూడూరు మండలంలో గతంలో పనిచేసిన ఒక పోలీస్ అధికారి అక్రమ ఇసుక దందాపై ఉక్కుపాదం మోపారు. అయితే ఇది గిట్టని స్థానిక కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఒక గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆ నిజాయితీ గల అధికారిని బదిలీ చేయించారు. ఆ అధికారి బదిలీ కాగానే అక్రమార్కులు స్థానికంగా టపాసులు పేల్చి సంబురాలు చేసుకోవడం గమనార్హం. దీన్ని బట్టి నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
- ప్రస్తుత అధికారి ఏం చేయబోతున్నారు?
- గత అధికారిని బదిలీ చేయించి తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకున్న అక్రమార్కులకు ప్రస్తుత పోలీస్ అధికారి అడ్డుకట్ట వేస్తారా? లేదా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రస్తుత అధికారి అయినా నిజాయితీగా విధులు నిర్వహించి ఈ అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెడుతారా..? లేక సిండికేట్కు తలొగ్గి మౌనం వహిస్తారా..? అని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ఇసుక దోపిడీని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments