76వ వసంతంలోకి ప్రధాని.. ప్రచారక్ స్థాయి నుంచి దేశ ప్రధానిగా మోదీ ప్రస్థానం.
- నేడు ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం.
- ఆరెస్సెస్ ప్రచారక్ స్థాయి నుంచి దేశ ప్రధానిగా మోదీ ప్రస్థానం.
- వరుసగా మూడుసార్లు ప్రధాని అయిన రెండో వ్యక్తిగా నెహ్రూ సరసన చేరిక.
జనం వాయిస్, న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 17:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న తన 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నెల రోజుల పాటు ‘సేవా సే సంకల్ప్ అభియాన్’ పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ప్రతీ ఇంట్లో ‘ఆశీర్వాద దీపం’ వెలిగించి ప్రధానికి ఆశీస్సులు అందించాలని బీజేపీ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో ఒక సాధారణ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి, దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం వరకు ఆయన సాగించిన రాజకీయ ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
1950, సెప్టెంబర్ 17న గుజరాత్లోని వాద్నగర్లో దామోదర్దాస్, హీరాబా దంపతులకు నరేంద్ర మోదీ జన్మించారు. నిరుపేద కుటుంబంలో పెరిగిన ఆయన, చిన్నతనంలో తన తండ్రి నడిపే టీ స్టాల్లో సహాయం చేసేవారు. 1970ల ప్రారంభంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో చేరి, పూర్తిస్థాయి ప్రచారక్గా మారారు.
మోదీ రాజకీయ ప్రస్థానం కీలక మలుపు
సంస్థాగత పనుల్లో చురుకుగా పాల్గొంటూ, క్రమంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1985లో ఆరెస్సెస్ ఆయనను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుజరాత్ విభాగానికి పంపింది. అక్కడి నుంచి మోదీ రాజకీయ ప్రస్థానం కీలక మలుపు తిరిగింది.
బీజేపీలో చేరిన తర్వాత మోదీ వెనుదిరిగి చూసుకోలేదు. 1987లో గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 1995లో పార్టీ జాతీయ కార్యదర్శిగా, 1998లో జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు)గా నియమితులయ్యారు. 2001 అక్టోబర్లో కేశూభాయ్ పటేల్ స్థానంలో అనూహ్యంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
బీజేపీ వరుస విజయాలు
ఆయన నాయకత్వంలో 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు సాధించింది. గుజరాత్కు సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచిన మోదీ, మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసిన ‘గుజరాత్ మోడల్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
తొలిసారి ప్రధానిగా బాధ్యతలు
2013లో బీజేపీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించగా, 2014 లోక్సభ ఎన్నికల్లో పార్టీకి చారిత్రక మెజారిటీని అందించారు. పదేళ్ల యూపీఏ పాలనకు తెరదించుతూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తొలి పర్యాయంలో స్వచ్ఛ భారత్ మిషన్, 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ వంటి కీలక సంస్కరణలు అమలయ్యాయి.
2019 ఎన్నికల్లో బీజేపీ మరింత భారీ మెజారిటీ సాధించడంతో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిషేధం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు.
2024 ఎన్నికల తర్వాత మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక నేతగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments