ఓటీపీ అవసరం లేకుండా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాగిన్..
జనం వాయిస్, వెబ్ డెస్క్, జూన్ 6:
సోషల్ మీడియా వినియోగదారులకు శుభవార్త. సాధారణంగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్లలో లాగిన్ కావాలంటే మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విధానం తప్పనిసరిగా అమల్లో ఉంది. అయితే ఇప్పుడు ఓటీపీ అవసరం లేకుండానే లాగిన్ అయ్యే సరికొత్త సదుపాయాన్ని వొడాఫోన్ ఐడియా (వీఐ) తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
మెటా భాగస్వామ్యంతో వీఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త సాంకేతికత పేరు సైలెంట్ మొబైల్ వెరిఫికేషన్ (ఎస్ఎంవీ). ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్లలో లాగిన్ సమయంలో మొబైల్ నెట్వర్క్ ఆధారంగా ఆటోమేటిక్ ధృవీకరణ జరుగుతుంది. దీంతో ఓటీపీ కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. వినియోగదారుడి మొబైల్ నంబర్ను బ్యాక్గ్రౌండ్లోనే ధృవీకరించి వేగంగా లాగిన్ ప్రక్రియను పూర్తి చేస్తుంది.
ఎస్ఎంవీ అనేది నెట్వర్క్ ఆధారిత సురక్షిత ప్రమాణీకరణ సాంకేతికత. ఇందులో వినియోగదారు ఎలాంటి కోడ్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. యాప్ల మధ్య మారడం, ఓటీపీ సందేశం కోసం ఎదురుచూడడం వంటి ఇబ్బందులు కూడా ఉండవు. టెలికాం నెట్వర్క్ ద్వారా ధృవీకరణ పూర్తవడంతో లాగిన్ ప్రక్రియ మరింత వేగవంతం, సురక్షితంగా మారుతుంది.
కొత్త సిమ్ యాక్టివేషన్, మొబైల్ నంబర్ ధృవీకరణ, యాప్లో రీ-లాగిన్, అకౌంట్ పునరుద్ధరణ వంటి సందర్భాల్లో కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సిగ్నల్ బలహీనంగా ఉండే ప్రాంతాల్లో ఓటీపీలు ఆలస్యంగా రావడం లేదా అందకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలకు ఇది పరిష్కారంగా నిలవనుంది.
మెటాతో కలిసి ఈ తరహా ఫీచర్ను ప్రవేశపెట్టిన తొలి టెలికాం సంస్థగా వీఐ నిలిచింది. భవిష్యత్తులో ఇతర టెలికాం సంస్థలు కూడా ఇదే తరహా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో వినియోగదారులకు మరింత సులభమైన, వేగవంతమైన లాగిన్ అనుభవం లభించే అవకాశం ఉంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments