EPAPER
Friday, May 8, 2026
Google search engine

ఇంధన ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

📰 Generate e-Paper Clip

ఇంధన ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

జనం వాయిస్, న్యూఢిల్లీ, మే 7:

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా చమురు మార్కెటింగ్ సంస్థలు భారీ నష్టాలను భరిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 102 డాలర్ల వద్ద కొనసాగుతోంది. భారత్ అధికంగా దిగుమతులపై ఆధారపడటం వల్ల అంతర్జాతీయ ధరల ప్రభావం దేశీయ మార్కెట్‌పై తీవ్రంగా పడుతోంది. అయినప్పటికీ పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ.14, డీజిల్‌పై రూ.18 వరకు నష్టాలను చమురు సంస్థలు భరిస్తున్నట్లు తెలుస్తోంది.
డాలర్‌తో రూపాయి మారకపు విలువలో మార్పులు కూడా ఇంధన ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రూపాయి బలహీనపడితే దిగుమతి వ్యయం పెరిగి, చమురు సంస్థలపై మరింత ఒత్తిడి పడుతోంది. అలాగే కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ పన్నుల కారణంగా రాష్ట్రాల వారీగా ఇంధన ధరల్లో తేడాలు కనిపిస్తున్నాయి.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు ప్రపంచ చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధి మార్గంలో చమురు సరఫరా పునరుద్ధరణపై అంతర్జాతీయంగా ఆశలు ఉన్నప్పటికీ పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 14.2 కిలోల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరను ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగిస్తోంది. ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.913గానే ఉంది.
అయితే వాణిజ్య వినియోగదారులకు మాత్రం ధరల పెరుగుదల తప్పలేదు. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను సగటున రూ.993 వరకు పెంచినట్లు సమాచారం. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై అదనపు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!