జేఈఈ మెయిన్ పరీక్షకు షెడ్యూల్ విడుదల.
జనం వాయిస్, న్యూ ఢిల్లీ :
జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతోన్న లక్షలాది మంది విద్యార్థులకు ఎన్టీఏ కీలక అప్డేట్ ఇచ్చింది. రెండు సెషన్లలో నిర్వహించే ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి ఆదివారం షెడ్యూల్ను విడుదల చేసింది. జనవరి 21 నుంచి 30 మధ్య తేదీల్లో జేఈఈ మెయిన్ (సెషన్ 1), ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య సెషన్ -2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడిరచింది. అయితే, ఈ పరీక్షలు జరిగే కచ్చితమైన తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. జేఈఈ మెయిన్ సెషన్ -1 పరీక్షకు ఈ నెల నుంచే ఆన్లైన్ దరఖాస్తులు వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. సెషన్-2 పరీక్షకు జనవరి ఆఖరి వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యేలా ఎగ్జామ్ సిటీల సంఖ్యను పెంచేందుకు కృషిచేస్తున్నామని.. దివ్యాంగ అభ్యర్థుల అవసరాలను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంది. జేఈఈ (మెయిన్) 2026 పరీక్షను సజావుగా నిర్వహించడంలో భాగంగా అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ముందే అవసరమైన డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలని ఎన్టీఏ ఇటీవల కోరిన విషయం తెలిసిందే. తద్వారా దరఖాస్తుల ప్రక్రియ, తదుపరి దశల్లో ఎదురయ్యే ఇబ్బందులు తప్పుతాయని, దరఖాస్తుల తిరస్కరణ, తదితర సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments