బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం.
– కోర్టులో బాధితురాలి వాంగ్మూలం.
– తల్లితో కలిసి మేడ్చల్ కోర్టుకు హాజరు.
– సిట్ దర్యాప్తుపై ఆసక్తి.
జనం వాయిస్, హైదరాబాద్, మే 16:
బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితురాలు తన తల్లితో కలిసి మేడ్చల్ కోర్టుకు హాజరై మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. ఈ పరిణామం కేసు దర్యాప్తులో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బాధితురాలు రెండు సందర్భాల్లో పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తాజాగా కోర్టులో నమోదు చేసిన ప్రకటనతో పాటు బాధితురాలి తల్లి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో తన కుమార్తెకు బలవంతంగా మద్యం ఇచ్చారని, ఆ తర్వాత బలహీన స్థితిలో ఉన్న సమయంలో భగీరథ్ ఒత్తిడి చేసి అనుచితంగా ప్రవర్తించాడని తల్లి ఆరోపించినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత తన కుమార్తె చాలా కాలంగా మానసిక వేదన అనుభవిస్తోందని ఆమె పేర్కొన్నట్లు తెలిసింది. ఈ కేసులో ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు కొనసాగిస్తోందని బాధితురాలి తల్లి తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారానికి సంబంధించి తమ వద్ద వాట్సాప్ చాటింగ్లు, సందేశాలు, ఇతర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించినట్లు తెలిసింది. దర్యాప్తులో ఈ ఆధారాలు కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో ఆధారాలను పరిశీలిస్తున్నాయి. కేసులో తదుపరి పరిణామాలపై రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments