పాన్-ఆధార్ లింక్ చేయలేదా? ఏం జరుగుతుందో తెలుసా..
జనం వాయిస్, హైదరాబాద్ – జనవరి 01:
ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం డిసెంబర్ 31, 2025 గడువు లోగా పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయని వారి విషయంలో జనవరి 1, 2026 నుంచి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆధార్తో లింక్ కాని పాన్ కార్డులు ఇకపై పనిచేయవని స్పష్టంగా ప్రకటించారు. దీంతో పన్ను చెల్లింపులు, బ్యాంకింగ్, పెట్టుబడులు వంటి అనేక ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఆధార్తో లింక్ కాని పాన్ కార్డు నిష్క్రియాత్మకంగా మారడంతో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం సాధ్యం కాదు. గతంలో చెల్లించిన పన్నులపై రీఫండ్లు కోరుకునే అవకాశం కూడా ఉండదు. బ్యాంకు ఖాతాలకు సంబంధించి కేవైసీ ప్రక్రియలు పూర్తికావు. కొత్తగా బ్యాంకు ఖాతాలు, పెట్టుబడి ఖాతాలు తెరవాలన్నా పాన్ కార్డు అవసరం ఉండటంతో ఆ పనులన్నీ నిలిచిపోతాయి.
ఇక అధిక విలువ గల ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం పూర్తిగా అసాధ్యం అవుతుంది. స్థిర నిధులు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, ఆస్తి కొనుగోళ్లు, రుణాల మంజూరు వంటి వ్యవహారాల్లో పాన్ కార్డు కీలకమైనది కావడంతో, లింక్ కాని పాన్ ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. జీతాలు, వడ్డీలు, ఇతర ఆదాయాలపై టీడీఎస్ ఎక్కువ శాతంలో కట్టే అవకాశం కూడా ఉందని పన్ను నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే గడువు దాటిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. నిర్ణీత గడువు లోగా లింక్ చేయని వారు ఇప్పుడు రూ.1000 ఆలస్య రుసుము చెల్లించి పాన్-ఆధార్ లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పాన్ కార్డు మళ్లీ యథావిధిగా పనిచేయడం ప్రారంభమవుతుంది. ఆన్లైన్ ద్వారా ఆధార్-పాన్ అనుసంధాన ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అయితే కొన్ని వర్గాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. స్థానికేతరులు, నిర్దేశిత వయస్సు దాటిన సీనియర్ పౌరులు, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చిన కొన్ని వర్గాల వ్యక్తులు పాన్ను ఆధార్తో లింక్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మొత్తానికి ఆధార్-పాన్ అనుసంధానం చేయకపోతే ఎదురయ్యే సమస్యలు చాలా తీవ్రంగా ఉండటంతో, ఇంకా లింక్ చేయని వారు ఆలస్యం చేయకుండా జరిమానాతో అయినా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే పాన్-ఆధార్ లింక్ ఇప్పుడే పూర్తి చేయడం అత్యంత అవసరమని స్పష్టం చేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments