తెలంగాణ కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు.
బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు.
పదవీ విరమణ చేసిన రామకృష్ణారావు.
అధికారులు ఘనంగా అభినందనలు.
జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 30:
తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖల కార్యదర్శులు, సచివాలయ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 26న ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన కె. రామకృష్ణారావు స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. పరిపాలనలో విస్తృత అనుభవం కలిగిన అధికారిగా సంజయ్ జాజుకు గుర్తింపు ఉంది.
బాధ్యతల స్వీకరణ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. రాష్ట్ర పరిపాలనను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అదే కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన మాజీ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రభుత్వ సేవల్లో ఆయన అందించిన సేవలను కొనియాడుతూ పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు. వివిధ శాఖల అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర పరిపాలనలో ప్రధాన కార్యదర్శి పదవి కీలకమైనదిగా భావిస్తారు. ప్రభుత్వ విధానాల అమలు, శాఖల మధ్య సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో ప్రధాన కార్యదర్శి ముఖ్య భూమిక పోషిస్తారు. ఈ నేపథ్యంలో సంజయ్ జాజు బాధ్యతల స్వీకరణకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, పరిపాలనా సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments