రీల్స్ మోజు ప్రాణం తీసింది.
– స్టంట్ చేస్తూ బాలుడి దుర్మరణం.
– నాచారంలో విషాదం.
– బాల్కనీపై స్టంట్ చేస్తూ కిందపడ్డ 14 ఏళ్ల బాలుడు.
– సోషల్ మీడియా వ్యామోహంపై ఆందోళన.
జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 21:
సోషల్ మీడియా రీల్స్ వ్యామోహం మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి వేదికలలో గుర్తింపు పొందాలని ఆశించిన 14 ఏళ్ల బాలుడు మిథున్ ప్రమాదకర స్టంట్ ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. నాచారం ప్రాంతంలోని మల్లాపూర్ గాంధీ బొమ్మ సమీపంలోని బస్తీలో నివసిస్తున్న మిథున్ తన ఇంటి బాల్కనీ రెయిలింగ్పై ఫీట్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సంతులనం కోల్పోయి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మిథున్ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో ప్రసిద్ధి కోసం యువత ప్రమాదకర స్టంట్లకు పాల్పడటం పెరుగుతున్నందున నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై మరింత పర్యవేక్షణ వహించాలని సూచిస్తున్నారు.
ప్రాణాలకు ముప్పు కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం తప్పని, జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. ఈ ఘటన యువతకు ఒక హెచ్చరికగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. సోషల్ మీడియా వినియోగంలో బాధ్యతాయుత దృక్పథం అవసరమని సూచించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments