వీధి కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి బలి.
– పెద్దపెల్లి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
– సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో విషాదం.
– ఇటుక బట్టీ కార్మికుల బిడ్డను పొట్టనబెట్టుకున్న కుక్కలు.
జనం వాయిస్, పెద్దపల్లి, ఏప్రిల్ 21:
పెద్దపెల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో BBI ఇటుక బట్టీలలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. ఈ దాడిలో మూడు సంవత్సరాల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఇటుక బట్టీలలో ఆడుకుంటున్న చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసిన కుక్కలు, ఒళ్లంతా పీక్కీతినడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బెహరా భూబన్, సరస్వతి దంపతులు బతుకుదెరువు కోసం మూడు నెలల క్రితం కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీలో పని చెయ్యడానికి ఒరిస్సా నుండి వచ్చారు.వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దివ్య (మూడు సంవత్సరాలు ) రెండవ కుమార్తె. ఈరోజు ఉదయం తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉండగా, ఇద్దరు చిన్నారులు ఇటుక బట్టీలలో ఉన్న గుడిసెల వద్ద ఆడుకుంటుండగా
అదే సమయంలో అక్కడికి వచ్చిన వీధి కుక్కల మంద చిన్నారి మెడ ను తీవ్రంగా గాయపరిచడం తో అక్కడికక్కడే పాప మృతి చెందింది.
వెంటనే పాపను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. కళ్లముందే ఆడుకుంటూ కనిపించిన బిడ్డ శవమై పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో కాట్నపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటుక బట్టీల వద్ద రక్షణ లేకపోవడం, వీధి కుక్కల బెడద పెరిగిపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని వలస కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments